కరప మండల కేంద్రమైన కరప గ్రామంలో వరుస దొంగతనాల ప్రయత్నాలు చోటుచేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లోనే కాకుండా పట్టపగలు బరితెగించి దొంగతనాలకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటలో పట్టపగలు ఇద్దరు దుండగులు ఇళ్లలోకి చొరబడి మహిళల మెడలోని బంగారం లాగేందుకు ప్రయత్నించారు.మహిళలు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.గత నెల 21న ఇంటిలోకి చొరబడి మరో మహిళ మెడలోని ఐదు కాసుల బంగారు తాడు లాక్కొని దుండగులు తప్పించుకున్నారు. విష్ణాలయం వీధిలో కూడా ముగ్గురు దుండగులు ఓ ఇంటిలోకి చొరబడి మహిళ మెడలోని బంగారు గొలుసు, నల్లపూసలు లాక్కొని వెళ్లిపోయారు.గ్రామంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దొంగతనాల ప్రయత్నాలు జరుగుతుండటంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నామని మహిళలు ఒంటరిగా ఇంట్లో ఉండడానికి భయపడుతూ తలుపులు తాళాలు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, గోన శ్రీను, పేకేటి దుర్గాప్రసాద్, కసిలంక సతీష్, పేపకాయల పవన్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.బైకులు, ఆటోలు దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనల అనంతరం గ్రామంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని, రాత్రిపూట మాత్రమే కాకుండా పగటి వేళల్లో కూడా పోలీసు గస్తీ నిర్వహించాలని వారు కోరుతున్నారు.దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని గ్రామస్తులు పోలీసులను విజ్ఞప్తి చేశారు.









