తెలుగు మరియు కన్నడ సీరియల్స్లో నటించే నటి రజిని (41), గత మూడు నెలలుగా సోషల్ మీడియా వేదికల ద్వారా లైంగిక వేధింపులకు గురైన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ‘నవీన్ కె మోన్’ అనే వ్యక్తి మొదట ‘Naveenz’ పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఆమె అంగీకరించకపోవడంతో మెసెంజర్ ద్వారా అశ్లీల సందేశాలు, తన ప్రయివేట్ పార్ట్స్ వీడియోలు పంపుతూ వేధించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రజిని పలుమార్లు అతడిని బ్లాక్ చేసినా, నిందితుడు కొత్త పేర్లతో ఖాతాలను సృష్టించి అదే విధంగా వేధింపులను కొనసాగించాడు.
నవంబర్ 1న నిందితుడు మళ్లీ మెసేజ్ చేయడంతో, నటి రజిని స్వయంగా అతడిని కలిసి హెచ్చరించింది. అయినా అతడు వినకపోవడంతో, అదే రోజు సాక్ష్యాధారాలతో ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై లైంగిక వేధింపులు, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా, నవీన్ ఫేక్ ఐడీల ద్వారా వీడియోలు పంపినట్లు, మెసెంజర్ ద్వారా అశ్లీల చాట్లు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
నిందితుడైన నవీన్ కె మోన్, బెంగళూరులోని ఒక అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్మెంట్ కంపెనీలో డెలివరీ మేనేజర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తూ కూడా, ఇలాంటి చర్యకు పాల్పడటం విచారకరం. పోలీసులు అతడిని సోమవారం అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మహిళలపై పెరుగుతున్న సైబర్ వేధింపుల నేపథ్యంలో, సోషల్ మీడియా దుర్వినియోగం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.









