నటనలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జాతీయ అవార్డు గ్రహీత నిత్యా మీనన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారమెత్తారు. మంగళవారం ఆమె తన సొంత నిర్మాణ సంస్థ ‘కీయురి ప్రొడక్షన్స్’ (Keyuri Productions) లోగోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. కేవలం సినిమాలు తీయడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను మానసికంగా స్పృశించే మరియు పరివర్తన కలిగించే కథలను అందించడమే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కొత్త ప్రయాణాన్ని ప్రకటిస్తూనే, తన తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని నిత్యా గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి గడిపిన క్షణాలను, అప్పట్లో తాము ఎదుర్కొన్న సవాళ్లను ఆమె నెమరువేసుకున్నారు. చిన్న సినిమాలు చేసుకుంటూ స్వేచ్ఛగా ఉండాలనుకున్న తన జీవితాన్ని ‘అలా మొదలైంది’ ఊహించని విధంగా మార్చేసిందని, అప్పటి స్ఫూర్తితోనే ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నానని తెలిపారు.
నిత్యా మీనన్ తన నిర్మాణ సంస్థ పేరు ‘కీయురి’ వెనుక ఉన్న అర్థాన్ని కూడా వివరించారు. భూమి లోతుల్లోంచి పుట్టిన, రాతితో చెక్కబడిన ఒక శక్తివంతమైన రూపంగా దీనిని అభివర్ణించారు. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా, సృజనాత్మకతకు పెద్దపీట వేసే ప్రాజెక్టులను తన సంస్థ ద్వారా నిర్మించనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రకటనతో అటు సినీ వర్గాలు, ఇటు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.








