ప్రముఖ కమెడియన్, రచయిత హైపర్ ఆది తాజాగా కులం, పరువు హత్యల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన పాడ్కాస్ట్లో ఆయన తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా పంచుకున్నారు. కులం ఫీలింగ్ను తాను అస్సలు నమ్మనని ఆది స్పష్టం చేశారు. “సమస్య వచ్చినప్పుడు నీ కులం వాడే రాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన కులం అడిగి ఇంజక్షన్ చేయించుకుంటామా? ప్రాణం పోతుంటే నీళ్లు ఇచ్చేవాడి కులం చూస్తామా?” అని ప్రశ్నిస్తూ, అవసరాన్ని బట్టి కులాన్ని వాడుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరువు హత్యలపై స్పందించిన ఆది ఘాటుగా విమర్శించారు. “సంబంధాలకేమో వారి కులం వాళ్లు కావాలి. కానీ అక్రమ సంబంధాలకు ఏ కులమైనా పర్లేదా? ఇది మనం బయట చూస్తూనే ఉన్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వారికి పెళ్లి చేసి, అబ్బాయికి పోషించే శక్తి ఉంటే అంగీకరించాలని హైపర్ ఆది హితవు పలికారు. ఒకవేళ ఉద్యోగం లేకపోతే, ఉద్యోగం తెచ్చుకోమని చెప్పాలి కానీ “ఇద్దరినీ చంపుకుంటే ఏం లాభం? ఒక్క నిమిషం ఆలోచిస్తే సరిపోయేదానికి హత్యలు ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రేమ వివాహాలు, పరువు హత్యల విషయంలో సామాజిక స్పృహతో కూడిన ఆయన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.









