పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. తన కెరీర్లో చివరి వరకు గుర్తుండిపోయేలా పవన్ కళ్యాణ్తో ఓ సంచలన సినిమా నిర్మించాలన్నదే తన అతిపెద్ద కల అని వెల్లడించారు. అంతేకాదు.. ఆ సినిమా తర్వాత తన ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ను శాశ్వతంగా మూసివేస్తానని కూడా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
తాజాగా ‘రాజా రవీంద్ర టాక్స్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ను దేవుడిలా భావించే ఆయన, “పవనేశ్వరా”, “దేవరా” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. మరోసారి పవన్తో సినిమా చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా షాక్ అయ్యే స్థాయిలో పవన్ కళ్యాణ్తో సినిమా తీసి.. ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్కు ముగింపు పలకాలనేది నా కోరిక” అని అన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి మాట్లాడిన బండ్ల గణేష్.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. “చిరంజీవిగారితో సినిమా అంటే సాధారణంగా ఉండకూడదు. మరో 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తు చేసుకునేలా, మా పిల్లలు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ‘గబ్బర్ సింగ్’ ఇప్పటికీ ఎలా మాట్లాడుకుంటున్నారో.. అలాగే చిరంజీవిగారితో చేసే సినిమా కూడా చరిత్రలో నిలిచిపోవాలి” అని వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కథలు దొరకడం కష్టమవుతోందని, AI ప్రభావం ఇండస్ట్రీ భవిష్యత్తుపై అనేక సందేహాలు పెంచుతోందని అన్నారు. “సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రావడం లేదు. బాగాలేని సినిమాలు అయితే రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏదో పెద్ద మార్పు రాబోతోందనే ఫీలింగ్ కలుగుతోంది” అని చెప్పారు. ఒక ఎగ్జిబిటర్గా కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నానని, థియేటర్ల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ‘బండ్ల గణేష్ బ్లాక్బస్టర్స్’ పేరుతో కొత్త బ్యానర్ను ప్రారంభించిన ఆయన.. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్తో కలిసి చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. రూ.4 నుంచి 5 కోట్ల మధ్య బడ్జెట్తో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.









