ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ను మరింత పెంచుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో 2024లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి, అల్లు అర్జున్ను నేషనల్ స్టార్గా మరింత బలంగా నిలబెట్టింది.
ఇక ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్తో పాటు అత్యాధునిక VFX టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘రాకా’లో అల్లు అర్జున్ ఓ ట్రైబల్ వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన మూడు విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారని సమాచారం. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాల కలయికగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ కథ రెండు విభిన్నమైన టైమ్లైన్స్లో సాగుతుందని సినీ వర్గాల్లో టాక్. అందులో ఒకటి పౌరాణిక, వేదకాలానికి సంబంధించినదిగా.. మరోటి ఆధునిక కాలానికి సంబంధించినదిగా ఉంటుందని సమాచారం. ఈ రెండు కాలాలను కనెక్ట్ చేస్తూ కథను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నట్లు సమాచారం. రష్మిక మందన్నతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో ‘రాకా’ను గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ‘రాకా’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో మూవీ ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సెకండాఫ్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి డిసెంబర్లో ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్ నిజంగానే వస్తుందా.. అల్లు అర్జున్ ఏ లుక్లో కనిపించబోతున్నాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








