భారీ విజయం సాధించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చిత్రంలో కథానాయకుడిగా రణ్వీర్ సింగ్ను ఎంపిక చేసిన కారణాలను జియో స్టూడియోస్ సీఈఓ, సహ నిర్మాత జ్యోతి దేశ్పాండే వెల్లడించారు. భారీ బడ్జెట్తో రూపొందే చిత్రాలకు కేవలం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కంటే, పాత్రలో పూర్తిగా లీనమై నటించగల ప్రతిభావంతులైన నటులే అవసరమని ఆమె పేర్కొన్నారు.
చిత్ర నిర్మాణ ప్రక్రియ గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువైంది. మొదట దీనిని ఒకే భాగంగా రూపొందించాలని అనుకున్నాం. అయితే కథ విస్తృతంగా ఉండటంతో చివరకు రెండు భాగాల సిరీస్గా తెరకెక్కించాల్సి వచ్చింది. బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో భారీ పారితోషికాలు తీసుకునే స్టార్ హీరోల కంటే, నటనకు ప్రాధాన్యమిచ్చే కళాకారులను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాం” అని జ్యోతి దేశ్పాండే తెలిపారు.
రణ్వీర్ సింగ్ నటనా ప్రతిభను కొనియాడుతూ, “ఈ పాత్ర కోసం రణ్వీర్ నా మొదటి ఎంపిక. గతంలో ‘రామ్-లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రాల్లో కలిసి పనిచేశాం. ఆయన ఏ పాత్రలోనైనా పూర్తిగా లీనమై నటిస్తారు. బాజీరావ్గా అయినా, అల్లౌద్దీన్ ఖిల్జీగా అయినా తెరపై రణ్వీర్ సింగ్ కనిపించరు; ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అదే ఆయన గొప్పతనం” అని ఆమె అన్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్లో పాకిస్థాన్లో రహస్యంగా విధులు నిర్వహించే భారతీయ గూఢచారి కథను ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. రణ్వీర్ సింగ్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.









