వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎత్తులు ఎవరికి అర్థం కావు. ఆయన్ను దగ్గర నుంచి చూసే వారికి కూడా తన తర్వాతి అడుగు ఎటు అనేది తెలియనివ్వని తత్వం ఆయనిది. అందుకే జగన్ ఎత్తులకు ప్రత్యర్ధులు చాలా సార్లు తలలు పట్టుకున్నారు. తాజాగా ఆయన కొత్త ప్రయోగం చేశారు. అది చూసి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు మైండ్ బ్లాక్ అయింది.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత.. పార్టీ పూర్తి స్థాయి ప్రక్షాళణకు జగన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పార్టీలో యాక్టివ్ గా లేని నేతలను పక్కన పెట్టడంతో పాటు.. నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాను జగన్ చాలా పర్సనల్ గా తీసుకున్నారు. గత రెండు సార్లు ఓటమి పాలైన గుంటూరు పార్లమెంట్ ను గాడిలో పెట్టెందుకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును రంగంలోకి దింపారు. ఆయన కూడా చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే గతంలో అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి స్థానానికి ఖాళీ ఏర్పడింది. అక్కడ సీనియర్ లీడర కన్నా లక్ష్మీ నారాయణ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో సత్తెనపల్లి వైసీపీ క్యాడర్ కు తమ బాధలు చెప్పుకునేందుకు లీడర్ లేకుండా పోయారు. ఈ టైంలోనే కన్నాను ఢీ కొట్టేందుకు.. పార్టీని సూపర్ యాక్టీవ్ చేసేందుకు వైసీపీ సీనియర్ లీడర్, జగన్ కు అత్యంత సన్నిహితుడు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డిని సత్తెనపల్లి ఇన్చార్జ్ గా పంపుతారని ఊహాగానాలు జోరుగా జరిగాయి. ఆర్కే వస్తే తమకు కూడా కొంచం కష్టమే అని కన్నా కూడా భావించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే సత్తెనపల్లిలో రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అయితే జగన్ మైండ్ లో మరో వ్యక్తి ఉన్నారు అని ఎవరు ఊహించలేకపోయారు. ఈక్రమంలోనే తన మైండ్ లో ఉన్న నరసరావుపేటకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్, గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేసిన డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డిని ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని జగన్ బుధవారం తాడేపల్లి పిలిపించుకున్నారు. ఈ వార్తలు నరసరావుపేట అంత గుప్పమన్నాయి. గతంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వవద్దని డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి అఢ్డం తిరిగారు. ఆక్రమంలో జగన్ గజ్జల కుటుంబానికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం గజ్జల బ్రహ్మారెడ్డిని నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించబోతున్నారనే వార్తలు పల్నాడు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వ్యాపించేశాయి.
అయితే జగన్ ఇచ్చిన ట్విస్ట్ కు గజ్జల ఫ్యామిలీ కూడా ఒక రకంగా షాక్ కు గురవ్వడమే కాకుండా ఆశ్చర్యపోయారట. సత్తెనపల్లికి వెళ్లి పనిచేయాలని జగన్ ఆదేశించారని అది కూడా పార్టీ సీనియర్ అయిన గజ్జల బ్రహ్మారెడ్డిని కాకుండా ఆయన కుమారుడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని రంగంలోకి దింపాలని జగన్ ఆదేశించారని విశ్వసనీయ సమాచారం. అయితే ఎలాంటి రాజకీయ హిస్టరీ లేని సుధీర్.. కన్నా లాంటి సీనియర్ నేతను ఢీ కొట్టడం, సొంత నియోజకవర్గం నరసరావుపేట కాకుండా సత్తెనపల్లి వెళ్లాలనే జగన్ నిర్ణయం అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. కన్నా మీదకు ఆర్కేను పంపిస్తారనుకుంటే కొత్తగా, సాఫ్ట్ గా ఉంటే డాక్టర్ ను తీసుకొస్తున్నారేంటని క్యాడర్ ఆశ్చర్యపోతున్నారు.









