కియారా అద్వానీ.. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె..మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.ఈ సినిమా విజయం అందుకోవడంతో ఈమెకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ వినయ విధేయ రామ’ సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమాతో మంచి విజయం లభిస్తుందని అమ్మడు ఎన్నో అంచనాలు పెట్టుకున్నా.. ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ..ఆ తర్వాత రామ్ చరణ్ తో మళ్లీ జత కట్టింది. అదే గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
రూట్ మార్చినా.. విడుదలకు నోచుకోని సినిమా..
కానీ ఈ సినిమా కూడా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కొన్ని థియేటర్ల నుండి సినిమాను తీసేశారు కూడా.. అలా రెండు చిత్రాలతో ఫ్లాప్ చవిచూసిన ఈమె.. ప్రస్తుతం ప్రముఖ శాండిల్ వుడ్ హీరో యశ్ తో తాజాగా జతకట్టింది . లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ సినిమాలో యశ్ సరసన హీరోయిన్గా ఎంపికయింది ఈ ముద్దుగుమ్మ . వాస్తవానికి మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని మొదట మేకర్స్ ప్రకటించినా.. ఆ తర్వాత జూన్ 4కి వాయిదా వేశారు. విదేశాలలో ఈ సినిమా మార్కెట్ ను మరింత విస్తృతం చేయాలి అనే నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నట్లు స్వయంగా హీరో ప్రకటించారు.
టాక్సిక్ బోల్డ్ సీన్స్ వివాదం..
అయితే త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా హీరోయిన్ సన్నివేశాలకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా వివాహం అయిన తర్వాత వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న కియారా అద్వానీ ఇందులో చాలా బోల్డ్ గా నటించింది. ఈ నేపథ్యంలోనే ఫైనల్ అవుట్ పుట్ చూసిన కియారా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సినిమాలోని కొన్ని బోల్డ్ సీన్లను కట్ చేయాలని లేదా నిడివి తగ్గించాలని డైరెక్టర్ ను కోరిందట . కానీ దర్శకురాలు మాత్రం ఆ సీన్లను కట్ చేస్తే కథలో సోల్ పోతుంది .కాబట్టి ఏం చేయలేని పరిస్థితి అని డైరెక్టర్ చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి.
నాన్ సెన్స్ అంటూ స్పందించిన కియారా..
అలా ఈ వార్తలు రోజు రోజుకి వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా కియారా ఈ విషయంపై స్పందించింది. ఆ వార్తలన్నీ నాన్సెన్స్ అంటూ కొట్టి పారేసింది. “టాక్సిక్ సినిమాలో నా పాత్ర గురించి లేదా నేను పోషించిన సీన్ల గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఆధారాలు లేనివి ..పుకార్లు మాత్రమే. స్క్రిప్ట్ విషయంలో కానీ బోల్డ్ సీన్ల విషయంలో కానీ నేను చిత్ర యూనిట్ కి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. కావాలనే ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మకండి” అంటూ క్లారిటీ ఇచ్చింది కియారా. ఇక మొత్తానికైతే కియారా ఈ వార్తలపై స్పందించడంతో ఈ వివాదానికి కాస్త తెరపడినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో కియారాతో పాటు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.







