కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా రావాల్సిన ‘ఇండియన్ 3’ పరిస్థితి ఏంటి అనే చర్చ అప్పట్లో బాగా జరిగింది.
‘ఇండియన్ 2’ ఫలితంతో ‘ఇండియన్ 3’ ప్రాజెక్ట్ను పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది.
చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఇండియన్ 3’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను మళ్లీ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘ఇండియన్ 2’తో పాటు ‘ఇండియన్ 3’కు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు కేవలం కొంత ప్యాచ్ వర్క్తో పాటు కీలకమైన సీజీ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
అందుకే మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శంకర్కు ‘ఇండియన్ 3’ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో.. ఈ సినిమా ద్వారా మరోసారి తన సత్తా చాటాలని శంకర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ‘ఇండియన్ 3’పై మళ్లీ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా నిజంగానే తిరిగి సెట్స్పైకి వస్తుందా? ఎప్పుడు విడుదల కానుంది? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
త్వరలోనే ‘ఇండియన్ 3’పై మేకర్స్ నుంచి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.








