కాకినాడ జిల్లా పిఠాపురంలో రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. 2022లో పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. అప్పట్లో నిందితులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాజాగా జీవో విడుదల చేసింది. ఏసీబీ దాడుల సమయంలో పలు రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. దాడులు చేసినప్పుడు డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.92 వేలు, కార్యాలయంలో టేబుల్స్ వద్ద రూ.17 వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.27 వేల నగదును ఏసీబీ గుర్తించింది. మొత్తంగా పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.1,24,810 నగదును సీజ్ చేసింది. పలువురు ఉద్యోగులను విచారించింది. మొత్తంగా పిఠాపురంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనితీరుపైనా ఏసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పట్లో రిజిస్ట్రార్ కార్యాలయ సేవలపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యాలయంపై దృష్టి సారించి, పలు రికార్డులను సీజ్ చేశారు.
ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎవరిని పట్టుకోనప్పటికీ, ప్రైవేటు వ్యక్తులు నగదు లావాదేవిలపై పూర్తి విచారణ చేశారు. అనంతరం ఇక్కడ పనిచేసిన ఉద్యోగులను స్థానాలు మార్పు చేశారు. ఆ తర్వాత ఉద్యోగులపై ఏసీబీ విచారణ చేసింది. ఈ విచారణ ప్రకారం అప్పట్లో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన వి.వి.వి. సత్యన్నారాయణ, నరసమాంబలతోపాటు, సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన శిరీష, జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన నాయబ్ రసూల్ను నిందితులుగా చేర్చింది. వీరితోపాటు ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగి కె.అప్పారావు పైనా క్రమ శిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఈమేరకు శుక్రవారం జీవోనెం. 67, 68, 69 లను విడుదల చేసింది. సీసీఏ రూల్స్ కింద క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఏసీబీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉత్తర్వులు ఇచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖతోపాటు, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉత్తర్వులు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. గతంలో జరిగిన ఏసీబీ దాడుల ప్రభావం తమపై ఉండదనుని భావించిన ఉద్యోగులకు చెమటలు పడుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులు ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.









