నటి రష్మిక మందన్న ఇటీవల రుతుస్రావ నొప్పి గురించి చేసిన వ్యాఖ్యలపై వచ్చిన వివాదంపై స్పందించారు. తన మాటలను పూర్తిగా వక్రీకరించి, తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే షోలు, ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయమేస్తుందని తెలిపారు. తాను ఒక ఉద్దేశంతో మాట్లాడితే, దాన్ని పూర్తిగా భిన్నంగా చూపిస్తున్నారని, తాను చెప్పాలనుకున్న దానికి, బయటకు వస్తున్న దానికి పొంతన ఉండటం లేదని రష్మిక అన్నారు.’ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రచారంలో భాగంగా, “మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే, ఆ బాధ ఏంటో తెలుస్తుంది” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ, తాను ఆ బాధను అనుభవించే ఉద్దేశంతోనే అలా అన్నానని స్పష్టం చేశారు. రుతుస్రావం సమయంలో తాను తీవ్రమైన నొప్పితో బాధపడతానని, ఒకసారి నొప్పి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయానని వెల్లడించారు. వైద్యులు సైతం ఇది సాధారణమేనని చెప్పడంతో, ఆ నొప్పి తీవ్రత అనుభవించిన వారికే తెలుస్తుందని రష్మిక తెలిపారు.
ఈ వివాదంపై రష్మిక అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కొందరు కావాలనే ఆమె పూర్తి ఇంటర్వ్యూను చూపించకుండా, కేవలం ఆ ఒక్క వ్యాఖ్యను మాత్రమే వైరల్ చేస్తున్నారని వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఆమె చెప్పిన పూర్తి విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.









