బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నాలుగేళ్లు గడిచినా, ఈ కేసుపై అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. 2020 జూన్లో ముంబైలోని ఆయన ఫ్లాట్లో మృతి చెందిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ఒక ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకోలేదని, అతడిని దారుణంగా హత్య చేశారని ఆమె స్పష్టం చేశారు.
సంఘటన స్థలం, వైద్య నిపుణుల అభిప్రాయాలు
శ్వేత సింగ్ కీర్తి సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. సుశాంత్ మంచానికి, ఫ్యాన్కు మధ్య ఉన్న దూరం, అలాగే ఆయన మెడపై ఉరితాడు గుర్తు కాకుండా కేవలం చిన్న చైన్ ముద్ర మాత్రమే ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె వివరించారు. ఈ మేరకు, తాను అమెరికాలో మరియు ముంబైలో సంప్రదించిన ఇద్దరు మానసిక నిపుణులు కూడా ఇది హత్యేనని, ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పడం తనను షాక్కు గురిచేసిందని ఆమె తెలిపారు.
అసూయ, బెదిరింపు కాల్స్, రియా ప్రవర్తనపై అనుమానాలు
తన తమ్ముడి కెరీర్ వేగంగా ఎదుగుతున్న సమయంలో కొందరు అసూయతో చేతబడి చేయించారని శ్వేత సంచలన విషయాలు బయటపెట్టారు. అంతేకాకుండా, 2020 మార్చి తర్వాత సుశాంత్ బతకడంటూ తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆమె పేర్కొన్నారు. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తనపై కూడా శ్వేత అనుమానాలు వ్యక్తం చేశారు. రియా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన “నువ్వు చాలా వేగంగా ఎగురుతున్నావ్, నీ రెక్కలు కత్తిరించాలి” అన్న అర్థం వచ్చే పోస్ట్కు సుశాంత్ లైక్ చేయడం తనకు వింతగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో దర్యాప్తు సంస్థలు ఆత్మహత్యగా తేల్చినప్పటికీ, శ్వేత సింగ్ చేసిన ఈ తాజా ఆరోపణలతో సుశాంత్ కేసుపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.









