మాజీ సర్పంచ్ల బకాయిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాజీ సర్పంచ్లు రాజకీయ పార్టీల ఉచ్చులో పడవద్దని సూచించారు.
సర్పంచ్లకు వచ్చే మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని… కానీ, ఆనాడు సర్పంచ్ ల ఆత్మహత్యలకు కారణమైన వారే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చినప్పుడు మన వద్ద రూ.10 వేల కోట్ల నష్టం సంభవిస్తే… కేంద్రం కేవలం రూ.400 కోట్లే ఇచ్చిందన్నారు.









