ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ మేరకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో అక్టోబర్ 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో బైక్పై ఇంటికి వెళుతున్న గంగారెడ్డిని అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేశాడు.
కాగా, గంగారెడ్డి హత్యకు గల కారణాలను పరిశీలించినట్లయితే.. సంతోష్ కుటుంబానికి సంబంధించిన భూ వివాదాల్లో గంగారెడ్డి తలదూర్చుతున్నాడని గత కొంతకాలం నుంచి సంతోష్కు కోపం ఉంది. 2020లో సంతోష్పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డేనని కోపంతో ఉన్న సంతోష్ 15 రోజుల క్రితం కేసు రాజీ కోసం గంగారెడ్డితో మాట్లాడాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పగ పెంచుకున్న సంతోష్ పథకం ప్రకారం గంగారెడ్డిని హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.
ఈ హత్య కేసు జగిత్యాలలోనే గాక, తెలంగాణ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. గంగారెడ్డి హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాదాపు 3 గంటలపాటు జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనా ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. దీంతో టీపీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు.
జీవన్ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి
గంగారెడ్డి హత్య నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నిలిచారు. జీవన్ రెడ్డి ఒంటరి కాదని.. సమయం వచ్చినప్పుడు జగ్గారెడ్డి అండగా ఉంటారని చెప్పారు. జీవన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిందని, ఆయనకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిన్న జీవన్ రెడ్డి ఆవేదన మీడియాలో చూసిన తర్వాత చాలా బాధగా అనిపించిందన్నారు జగ్గారెడ్డి. ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. ఈ వయసులో కూడా ఆయనకు ఈ ఆవేదన ఏంటి అని మనసుకు బాధ కలిగిందన్నారు. జీవన్ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతుగా ఉన్నాడని మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు తెలిపారు.
తాను ఎవరినీ తప్పుబట్టడం లేదని.. జీవన్ రెడ్డి ఒంటరి అని అనుకోవద్దన్నారు. ఎప్పుడూ జనంలో ఉండే జీవన్ రెడ్డిని జగిత్యాల ప్రజలు, సంగారెడ్డిలో తనను ఎందుకు ఓడించారో తెలియడం లేదన్నారు. జీవన్ రెడ్డి సమస్యను అధిష్టానం గుర్తించి పరిష్కారం చూపాలని.. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను కోరుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.









