బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ‘క్వాంటం లీప్’ అని, ఆదిత్య ధార్ తన అద్భుతమైన విజన్తో భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశారని వర్మ కొనియాడారు.
దర్శకుడు ఆదిత్య ధార్ కేవలం సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా, ప్రేక్షకుల మానసిక స్థితిని కంట్రోల్ చేస్తూ కథను నడిపించారని వర్మ విశ్లేషించారు. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్లు కేవలం వినోదం లేదా చప్పట్ల కోసం డిజైన్ చేస్తారని, కానీ ‘ధురంధర్’లో హింస మరియు ఒత్తిడి చాలా సహజంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులను తెలివైనవారిగా భావించి, కథను నేరుగా చెప్పకుండా వారిలో ఒక ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సఫలమయ్యారని ప్రశంసించారు.
ఈ చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకుడిలో ఏదో తెలియని మార్పును కలిగిస్తుందని వర్మ అభిప్రాయపడ్డారు. భారతీయ గూఢచారి వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ నటన హైలైట్గా నిలిచింది. ఈ సినిమా సాధిస్తున్న విజయం చూస్తుంటే, త్వరలోనే ‘ధురంధర్’ తెలుగు వెర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.









