పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రాలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారాయి. ఇటీవలి కాలంలో విడుదలైన ‘మహావతార్ నరసింహా’ భారీ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అదే తరహాలో నిర్మాత నాగవంశీ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించారు.
‘వాయుపుత్ర’ అనే టైటిల్తో ఈ మైథలాజికల్ డ్రామాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించనున్నారు. “ఇది కేవలం సినిమా కాదు, పవిత్రమైన విజువల్ కావ్యం. మన ఇతిహాసాలు, పురాణాల్లోని అద్భుతమైన కథతో రూపొందుతోంది. త్రీడీ యానిమేషన్లో ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం” అని నాగవంశీ తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల చేసిన పోస్టర్ ఆధారంగా ఇది హనుమంతుడి జీవిత గాథగా రాబోతుందని స్పష్టమైంది.
ఇక మరోవైపు, నాగవంశీ ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ను కూడా ప్రకటించారు. “త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ సినిమా తెరకెక్కించనున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్ను అలాంటి పాత్రలో చూడబోతున్నాం. వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ ప్రారంభిస్తాం” అని నాగవంశీ ఇటీవల వెల్లడించారు. అయితే, ఆ ప్రాజెక్ట్ కంటే ముందే ప్రేక్షకులను ‘వాయుపుత్ర’ విజువల్ ఎక్స్పీరియెన్స్తో అలరించనున్నట్లు తెలుస్తోంది..









