ఎన్నో ఏళ్లుగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తూ చేనేత రంగం అభివృద్ధికి తోడ్పాటున అందిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నూరు శాతం పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉప్పాడ కొత్తపల్లి సురక్ష కమ్యూనిటీ హాలులో జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి చేనేత రంగంలో ఉప్పాడ చేనేత వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా చేనేత రంగంపై ఆధారపడి చేనేత రంగం అభివృద్ధికి తోడ్పాటున అందిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నూరు శాతం పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ సంఖ్యలో చేనేత రంగంపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారన్నారు. కాకినాడ జిల్లాలో రైతులు పండిస్తున పట్టుకు సరైన ధర రాక రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు.
