పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆయనను కలవాలంటే ఓ ప్రహసనమనే చెప్పాలి. నిత్యం ఆయన ప్రజల కోసం బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజలకు ఏదోక మంచి పనిచేయాలని, అక్రమాలు అడ్డుకోవాలంటున్న పవన్ గత ప్రభుత్వం చేసిన తప్పులను లెక్క పెట్టే పనిలో బిజీగా గడుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజలను కలుసుకోవాలని అనుకుంటున్నప్పటికీ, సమయం సరిపోవడం లేదన్నది ఆయన ప్రధాన మాట. అయితే ఏదోక మంచి పని చేసిన తర్వాతే తనను గెలిపించిన పిఠాపురంలో అడుగు పెట్టాలని అనుకున్నారంట. అందుకే ఆయన గెలిచిన నెల రోజులు అవుతున్న సమయంలో ఇటీవల, ఈనెల 1వ తేది నుండి 3వ తేది వరకూ పిఠాపురంలో తన పర్యటనను విజయవంతం చేశారు.
అయితే పవన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన అందర్ని ఆలోజింపజేసింది. పవన్ ప్రజల పట్ల ఎంత ఆసక్తి కనబరుస్తున్నారనేదానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. పిఠాపురం నుండి ఉప్పాడ మత్స్యకార ప్రాంతాన్ని పరిశీలించేందుకు పవన్ బయలుదేరిన సమయంలో జరిగిన ఘటన అందర్ని ఆకర్షించింది. పిఠాపురం రైల్వేగేటు పక్కన కొద్ది దూరంలో ఉన్న డ్రైవర్స్ కాలనీలో ఓ బాలుడు జనసేన జెండాతో మార్గంలో ఉన్న ఇంటి ముందు నిలుచున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ పడింది. తీరా చూస్తే వేగంగా పవన్ కారు నుండి దిగి బాలుడిని పట్టుకున్నారు.

సెక్యూరిటీ మొత్తం షాక్ అయ్యింది. కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చి బాలుడ్ని సైతం తనిఖీ చేశారు. ఈసమయంలో పవన్ సెక్యూరిటీ హాడావుడికి కాస్త వెనక్కి తగ్గారు. తనిఖీ అనంతరం సెక్యూరిటీ బాలుడిని పవన్ దగ్గరకు చేర్చారు. ఈసమయంలో పవన్ పార్టీ జెండా పట్టుకుని ఉన్న బాలుడిని చూసి మురిసిపోయారు. నువ్వు ఎంత చదువుతున్నావ్..నీ పేరేంటని అడిగాడు. జెండా ఎందుకు పట్టుకున్నావని బాలుడ్ని ప్రశ్నించాడు. దీంతో బాలుడు తనకు పవన్ అంటే ఇష్టమని చెప్పడంతో పవన్ నవ్వుకున్నారు. బాగా చదువుకో అంటూ భుజం తట్టి పవన్ తిరిగి కారు ఎక్కారు.
పవన్ తమ కుమారుడ్ని పట్టుకోవడం చూసిన తల్లిదండ్రులు ఉబ్బితబ్బవుతున్నారు.ఎంతో కాలం నుండి తమ కుమారుడు భరత్ పవన్ తో ఫోటో తీయించాలని కోరుతున్నాడని, కాని తమకు సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. అలాంటిది పవన్ తమ ఇంటి ముందు ఆగి తమ కుమారుడ్ని పలకరించడం నిజంగా షాక్ అయ్యామని అంటున్నారు. మొత్తం పవన్ ఇచ్చిన సడన్ సర్ప్రైజ్తో ఆ ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది.








