గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన క్రేజ్ను చాటుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన ప్రత్యేక సంచిక ‘షో స్టాపర్స్ 2026’ కవర్ పేజీపై అల్లు అర్జున్ మెరిశారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులు, కథల ప్రాధాన్యత గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సినిమా ఏ భాషలో తెరకెక్కింది అనేది కాదని.. ప్రేక్షకులను ఆకట్టుకునే బలమైన కథే విజయానికి ప్రధాన కారణమని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, మరే ప్రాంతీయ పరిశ్రమ అయినా.. కేవలం హీరో, హీరోయిన్ స్టార్డమ్తో సినిమాను విజయవంతం చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
మంచి కంటెంట్తో పాటు కొత్తదనంతో కూడిన కథ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అందుకే ఇప్పటి రోజుల్లో ప్రేక్షకులకు సరికొత్త కథలను అందించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
ఇక 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ వంటి వివిధ రంగాల్లో తమ ప్రతిభతో ప్రత్యేక ప్రభావం చూపిన 100 మంది ప్రముఖులతో ‘ఫోర్బ్స్ ఇండియా’ ‘షో స్టాపర్స్ 2026’ జాబితాను రూపొందించింది.
ఈ ప్రతిష్టాత్మక జాబితాలో అల్లు అర్జున్తో పాటు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, సూపర్స్టార్ రజనీకాంత్, మోహన్లాల్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితర ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.
దీంతో ‘షో స్టాపర్స్ 2026’ కవర్పై అల్లు అర్జున్ కనిపించడం ఆయనకు మరో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ‘పుష్ప’ తర్వాత గ్లోబల్ స్థాయిలో తన ఇమేజ్ను మరింత పెంచుకుంటున్న అల్లు అర్జున్కు ఈ గుర్తింపు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.









