నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హిందూ ధర్మంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సనాతన ధర్మాన్ని అవమానించేలా అనసూయ మాట్లాడారంటూ కొందరు తీవ్ర విమర్శలు చేయడంతో.. ఈ వివాదంపై ఆమె స్పందించారు.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన అనసూయ.. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని తెలిపారు. తాను ఏ మతాన్ని లేదా మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
తాను చెప్పిన మాటలు కొంతమందిని మాత్రమే ఉద్దేశించినవని అనసూయ వెల్లడించారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారినే తాను ప్రశ్నించానని చెప్పారు. తన వ్యాఖ్యలకు మతం లేదా వర్గంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అంతేకాదు.. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని అనసూయ పేర్కొన్నారు. తన ధర్మం, విలువలు, విశ్వాసాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ధైర్యంగా ఉండటం, నిజం వైపు నిలబడటం, తప్పును తప్పుగా ప్రశ్నించడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం వంటి విలువలను తన ధర్మమే నేర్పిందని తెలిపారు.
హనుమాన్ జీ ధైర్యం, బలం తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని అనసూయ అన్నారు. అందుకే అన్యాయం జరిగినప్పుడు తాను మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు.
తన మాటల్లోని అసలు సందర్భాన్ని తొలగించి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా ప్రచారం చేయడం సరికాదని అనసూయ అభిప్రాయపడ్డారు. మతం ఆధారంగా తాను ఎవరినీ నిర్ణయించనని, తనను వేధించే వారినే ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.
అందువల్ల ఎడిట్ చేసిన వీడియో క్లిప్స్, సగం సగం కథనాలను చూసి వెంటనే ఓ నిర్ణయానికి రావద్దని అనసూయ సూచించారు. పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాతే తనపై ఒక అభిప్రాయానికి రావాలని ఆమె కోరారు.








