ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఇటీవల మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సినిమాలు తగ్గించినప్పటికీ, సినీ పరిశ్రమపై తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారుతున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఫ్లాప్ సినిమాలు కాదని, సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్మాణ సమయంలో బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణమని ఆర్జీవీ స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా ఒక సంఘటనను ప్రస్తావిస్తూ, టాలీవుడ్లోని ఓ టాప్ హీరోయిన్ సినిమా షూటింగ్ కోసం పదిరోజుల పాటు సెట్స్లోనే ఉన్నప్పటికీ, ప్రణాళిక లోపం వల్ల ఆమె కేవలం ఒక్కరోజే షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిపారు. పని చేసిన రోజులు తక్కువైనా, ఒప్పందం ప్రకారం పూర్తి పారితోషికం తీసుకున్నారని వెల్లడించారు. ఇలాంటి మేనేజ్మెంట్ లోపాల వల్ల నిర్మాతలు భారీ నష్టాలను చవిచూస్తున్నారని ఆయన విమర్శించారు.
అదే సమయంలో, ఫ్లాప్ సినిమాల గురించి కూడా ఆర్జీవీ తనదైన లాజిక్ను వెల్లడించారు. ఒక సినిమా ఫ్లాప్ అయినా, టెక్నీషియన్లు, చిన్న నటులు, దినసరి కూలీలు వంటి అనేక మందికి ఉపాధి లభించి డబ్బు చలామణి అవుతుందని అన్నారు. కానీ ఒక సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయితే, దాని ద్వారా వచ్చే భారీ లాభాలు మాత్రం కొద్ది మంది హీరోలు, నిర్మాతలకే పరిమితం అవుతాయని పేర్కొన్నారు.
అందువల్ల, ఇండస్ట్రీని నష్టాల్లోకి నెడుతున్నది ఫ్లాప్ సినిమాలు కాదు… హీరోలు, నిర్మాతల నిర్లక్ష్యం మరియు ప్రణాళికా లోపాలేనని ఆర్జీవీ తేల్చిచెప్పారు.









