విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరో కార్తి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను ప్రకటించారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మోహన్ రాజాతో కార్తి తొలిసారి చేతులు కలిపారు. ఈ సినిమాకు కార్తి సైన్ చేసినట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, పూర్తి స్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్తో మోహన్ రాజా మరోసారి తన సొంత కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో ఆయన ఒరిజినల్ స్క్రిప్టులతో తెరకెక్కించిన ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు కార్తితో కలిసి మూడోసారి తన సొంత కథను తెరపైకి తీసుకురానుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
చిరంజీవి నటించిన ‘గాడ్ఫాదర్’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ‘ఎం. కుమారన్ ఎస్/ఓ మహాలక్ష్మి’, ‘వేలాయుధం’, ‘తని ఒరువన్’ వంటి చిత్రాలతో కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రాజా.. ఈసారి కార్తితో ఎలాంటి కథను చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. 2026 చివరి నాటికి షూటింగ్ ప్రారంభించేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.









