అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల అంశం గుజరాత్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. తమకు మ్యాచ్ టికెట్లు దొరకలేదని ఒక బీజేపీ ఎమ్మెల్యే సభలో ప్రస్తావించగా, దానికి స్పందించిన రాష్ట్ర మంత్రి.. భవిష్యత్తులో జరిగే ముఖ్యమైన మ్యాచ్లకు ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, వినోద కార్యక్రమాల టికెట్ల గురించి మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చర్చపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో స్కూల్ అడ్మిషన్లు దొరకక విద్యార్థులు, ఆసుపత్రుల్లో బెడ్లు లేక రోగులు, రవాణా సౌకర్యాలు లేక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రజా ప్రతినిధులు టికెట్ల కోసం ఆవేదన చెందడం దారుణమని ఆప్ నేత గోపాల్ ఇటాలియా విమర్శించారు. ప్రజల సొమ్ముతో నడిచే సభలో ఇలాంటి వ్యక్తిగత ప్రయోజనాలపై చర్చ జరగడం శాసనసభ గౌరవానికే భంగమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలో జరుగుతున్న ఈ పరిణామాలను గమనించాలని కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ మ్యాచ్ టికెట్ల కోసం డిమాండ్ చేయలేదని, బీజేపీ సభ్యులే ఈ అంశాన్ని లేవనెత్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా వివరణ ఇచ్చారు. సభలో ఒకవైపు సంతాప తీర్మానాలు జరుగుతుంటే, మరోవైపు క్రికెట్ మ్యాచ్ టికెట్లపై చర్చ జరగడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తున్న వేళ, గుజరాత్ అసెంబ్లీలో జరిగిన ఈ “టికెట్ పోరు” రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.








