కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్ల పాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.పొలాల్లో మృత దేహాలు చెల్లా చెదురయ్యాయి.
ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.








