కాకినాడ జిల్లాలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలతో కొనసాగతున్న నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ కోరారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాళ్లరేవు,కాజులూరు,కరప, కాకినాడ రూరల్, పెదపూడి మండలాల్లో 43 నుండి 45 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వాతావరణ శాఖ సూచన ప్రకారం ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు కొనసాగే అవకాశం ఉందన్నారు.ఈ విపరీత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఉదయం 10 గంటలకు ముందు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలని పని ప్రదేశంలో శ్రామికులు సేద తీరేందుకు టెంట్లు,త్రాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలెవరూ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, అనారోగ్యాలతో బాధపడేవారు తప్పనిసరైతే తప్పా ఎండవేళ ఆరు బయట సంచరించవద్దని సూచించారు.వైద్యులు,ఆరోగ్య సిబ్బంది సదా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.బస్ స్టాండులలోను, గ్రామాలు, వార్డుల ముఖ్య కూడళ్లలో వితరణ శీల దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఏ ఆవాసంలోనూ ప్రజలకు త్రాగునీటి సరఫరా ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అవసరమైతే వాహనాల ద్వారా సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.









