‘మా విలేజ్ షో’ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అంజిమామ. తనదైన తెలంగాణ యాస, సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా ‘ఐ డ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
తన జీవితంలో మొదటి నుంచి కష్టపడటం అలవాటేనని చెప్పిన అంజిమామ.. నటుడిగా మారకముందు ఎన్నో పనులు చేసినట్లు తెలిపారు. ప్లంబర్గా, ఎలక్ట్రీషియన్గా, ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశానని.. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ కూడా పెట్టానని చెప్పారు. అయితే ఏ పని చేసినా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోలేకపోయానని వెల్లడించారు.
ఇక త్వరగా ఎదగాలనే ఆలోచనతో స్నేహితులతో కలిసి ఓ ‘ఈజీమనీ’ స్కీమ్లో పెట్టుబడి పెట్టానని.. చివరకు దాదాపు రూ.24 లక్షలు నష్టపోయానని అంజిమామ తెలిపారు. మంచి జీవితం కోసం, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నానని.. కానీ ఆ నష్టం తన జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు.
అంతేకాదు.. ప్రస్తుతం నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు హైదరాబాద్లో క్యాబ్ కూడా నడుపుతున్నానని అంజిమామ వెల్లడించారు. ప్రతి నెలా ఇంటికి రూ.50 వేలు పంపించాల్సి ఉండటంతో క్యాబ్ నడపాల్సి వస్తోందని తెలిపారు. మాస్క్ పెట్టుకుని క్యాబ్ నడిపినా కొంతమంది తనను గుర్తుపడుతున్నారని చెప్పారు.
ఈ పరిస్థితులన్నింటి మధ్య కొన్నిసార్లు హైదరాబాద్లో ఉండటం ఎందుకు.. సొంతూరికి వెళ్లిపోతే బాగుంటుందేమో అనిపిస్తుందని అంజిమామ భావోద్వేగానికి గురయ్యారు. ఒక ఎకరం పొలం, నాలుగు బర్రెలు ఉంటే ప్రశాంతంగా జీవించవచ్చని తన మనసులోని మాటను బయటపెట్టారు.
అంజిమామ చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తెరపై ప్రేక్షకులను నవ్వించే ఈ నటుడి వెనుక ఇంతటి పోరాటం ఉందని తెలిసి అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.








