Search
Close this search box.

  ఓటీటీ, సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్..

ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో పెరిగిపోతున్న అసభ్యకర కంటెంట్ విషయమై కేంద్రం స్పందించింది. కొన్ని రోజుల క్రితం ఇండియా గాట్ లాటెంట్ అనే ఓ కార్యక్రమంలో ప్రముఖ యూట్యూబర్.. తల్లిదండ్రులు, శృంగారం విషయంలో పరిధులు దాటి మాట్లాడడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ విషయమై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేయగా, కోర్టులు సైతం చివాట్లు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఓటీటీ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం -2021లోని కోడ్ అఫ్ ఎథిక్స్ ను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చట్టం ప్రకారం నిషేధించిన, పరమితులు విధించిన కటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయొద్దని హెచ్చరించింది.

 

ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు, స్వీయ-నియంత్రణ సంస్థలకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. చిన్నారులకు ఏ రేటెడ్ కంటెంట్ ను అందుబాటులో ఉంచొద్దు అని, వయస్సు ఆధారిత వర్గీకరణకు కఠినమైన కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఎలాంటి పొరబాట్లు చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్వీయ-నియంత్రణ సంస్థలకు సూచించింది. ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ (OTT ప్లాట్‌ఫారమ్‌లు), సోషల్ మీడియా యూజర్ల నుంచి అశ్లీలత, అసభ్యకరమైన కంటెంట్ గురించిన ఫిర్యాదులు అందాయని తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటు సభ్యులు, చట్టబద్ధమైన సంస్థల నుంచి సైతం కంటెంట్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని వెల్లడించింది. మహిళలను అసభ్యంగా చిత్రీకరించే చట్టం, 1986, భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (Pocso)చట్టం, సమాచార సాంకేతిక (IT) చట్టం 2000 ప్రకారం అశ్లీల / అశ్లీల కంటెట్ ప్రచురించడం శిక్షార్హమైన నేరంగా తెలిపింది.

 

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న షోలో పాల్గొన్న అల్హాబాడియా వివాదాస్పద వ్యాఖ్యాలు చేసారు. ఈ షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని ఉద్దేశిస్తూ.. మీ తల్లిదండ్రులు ఏకాంతంగా కలిసున్నప్పుడు నువ్వు చూస్తావా, నువ్వూ వెళ్లి వాళ్లతో కలుస్తావా అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో అల్హాబాడియా మీద కేసులు నమోదయ్యాయి. ఇతని మాటలపై పార్లమెంటరీ సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేయగా, తమ ముందు హాజరు కావాలని నీతి, నియమాలపై ఏర్పటైన పార్లమెంటరీ సంఘం నోటీసులు జారీ చేసింది.

 

దీంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన అల్హాబాడియా తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకచోటకు చేర్చాలని అభ్యర్థించాడు. అతని వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. సోషల్ మీడియాలో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ ను నియంత్రించే విషయంలో కేంద్రం చర్యలపై ఆరా తీసింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఏవైనా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారా అంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తమకు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

 

మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అనేక షరతులు, ప్రసారమయ్యే కంటెంట్ పై అనేక నియంత్రణలు ఉన్న నేపథ్యంలో.. సోషల్ మీడియాపై ఎలాంటి నియంత్రణ సంస్థలు లేకుండా పోయాయి. దీంతో.. ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్లు పోస్టు చేసేస్తున్నారు. ఇందులో.. ఎక్కువగా అశ్లీలత, అసభ్యకర కంటెంట్ ఉంటుండడంతో.. అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ సంస్థలకు కేంద్రం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. ఐటీ నిబంధనల్ని, చట్టాల్ని అతిక్రమిస్తే తప్పక చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు