ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరో రెండు రోజులలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి సర్వం సిద్ధం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు {పీసీబీ}. టీమిండియా ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ లో పర్యటించేది లేదని చెప్పిన నేపథ్యంలో.. భారత్ తన మ్యాచ్ లు అన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడబోతోంది. అయితే ఈ ట్రోఫీ ఆరంభానికి ముందు ఇటీవల పాకిస్తాన్ కరాచీలోని గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేసి రీఓపెనింగ్ చేసిన సందర్భం తెలిసిందే.
అలాగే ఛాంపియన్స్ ట్రోఫి ప్రారంభానికి సంబంధించిన ఈవెంట్ ని కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ లోనే పాకిస్తాన్ యొక్క కొత్త జెర్సీని కూడా రివీల్ చేశారు. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా గడాఫీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించారు. కానీ ఇందులో భారతదేశ పతాకం లేకపోవడం గమనార్హం. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఈవెంట్ లో భారత జాతీయ జెండా మిస్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది.
కావాలనే పాకిస్తాన్ ఇలా చేసిందని, ఇండియా పాకిస్తాన్ కి రాలేదన్న కోపంతోనే భారతీయ జెండాను గడాఫీ స్టేడియంపై పెట్టలేదని కొంతమంది అభిమానులు అగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరికొందరు మాత్రం భారతీయ జెండాను చూస్తే పాకిస్తాన్ కి భయం అని, అందుకే తమ జెండాను గడాఫీ స్టేడియం పై పెట్టలేదని కామెంట్స్ చేశారు. 2009లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలు భారత్ – పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి.
అప్పటినుండి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కానీ ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రం ఇరుదేశాలు తలపడుతున్నాయి. అలాగే ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్ జరిగితే మాత్రం పాకిస్తాన్ జట్టు ఇండియాకు వచ్చి ఆడుతుంది. 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్.. ఇండియాలో మ్యాచ్ లు ఆడింది. ఇదిలా ఉంటే.. గడాఫీ స్టేడియంలో అన్ని జట్ల జెండాలను ప్రదర్శించి.. భారత జాతీయ జెండాని మాత్రం ప్రదర్శించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లివెత్తాయి.
దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు {పిసిబి} ఎట్టకేలకు దిగొచ్చింది. వెంటనే గడాఫీ స్టేడియంలో భారతీయ జెండాను ఏర్పాటు చేసింది. స్టేడియంలో భారత జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో భారత్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు.