తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరరైంది. ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం తో సీఎం రేవంత్ ఈ మేరకు చర్చలు చేసారు. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ తో పాటుగా శాఖల మార్పు పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. తన ప్రతిపాదనల తో రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినాయకత్వంతో సమావేశం అయ్యారు. గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దసరా నాడు విస్తరణకు నిర్ణయించారని సమాచారం.
హైకమాండ్ తో చర్చలు
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినాయకత్వంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో హైడ్రా వివాదం తో పాటుగా ప్రస్తుత పరిణామాల పైన చర్చించారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించటంతో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు..మంత్రివర్గ విస్తరణ…నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీ పైన చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో తీసుకొనే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. విస్తరణ ఖరారు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది.
విస్తరణ..శాఖలు
ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో చర్చల తరువాత కూర్పు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న హోం శాఖ సీతక్కకు కేటాయించటం దాదాపు ఖాయమైంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్లో స్థానం దక్కుతుంది. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని తెలుస్తోంది.
గ్రేటర్ లో ఏం చేద్దాం
కొత్తగా మంత్రివర్గంలోకి అదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా..నాలుగు భర్తీ చేసి రెండు స్థానాలు ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. మైనార్టీ, ఎస్టీల కోసం మరో బెర్తు ఖాళీగా ఉంచనున్నట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు పట్టు చిక్కలేదు. దీంతో, గ్రేటర్ ఎన్నికల్లోగా హైదరాబాద్ లో బలం పెంచుకునేలా కొత్త వ్యూహాల తో ముందుకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ నుంచి ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.









