రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురు రాజ్యసభ ఎంపీలు రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది. దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి. దీంతో సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113 కంటే తక్కువగా ఎన్డీయే సంఖ్యాబలం 101గా ఉంది. మెజారిటీకి ఎన్డీయే కూటమికి ఇంకా 12 మంది సభ్యులు అవసరం అవుతారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వద్ద మొత్తం 87 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 26 మంది, తృణమూల్ కాంగ్రెస్కు 13 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలకు చెరో 10 మంది చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్డీయే, ఇండియా కూటములలో లేని బీఆర్ఎస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. పలువురు స్వతంత్ర రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు.
బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీలే దిక్కు!
ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే బిల్లుల ఆమోదం పొందేందుకు ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ఇతర పార్టీలపై ఎన్డీయే కూటమి ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత దఫా ప్రభుత్వం మాదిరిగా మున్ముందు కూడా బిల్లుల విషయంలో అన్నాడీఎంకే, వైఎస్సార్సీపీ పార్టీల మద్దతను ఎన్డీయే పొందాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.