టాలీవుడ్లో క్యూట్ కపుల్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ సూపర్ హిట్గా నిలవడంతో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లోనూ కలిసి నటించారు.
ఇక ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘రణబాలి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ముందుగా ‘రణబాలి’ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ను మార్చేశారు. దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 10, 2026న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చేతిలో వేట కొడవలితో విజయ్ దేవరకొండ కనిపిస్తున్న లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్కు ఇచ్చిన పవర్ఫుల్ క్యాప్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే దసరా సీజన్లో రణబాలికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమవుతుండగా.. అక్టోబర్ 16న ధనుష్ నటిస్తున్న ‘ఓమ్ పార్ట్ 1’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా దసరా రేసులో ఉండబోతుందని వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా ఈ సినిమా రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం దసరా బరిలో రణబాలి, జైలర్ 2, ఓమ్ పార్ట్ 1 సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. వరుస సెలవులు, భారీ స్టార్ కాస్ట్ కారణంగా ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరి ఈ బాక్సాఫీస్ వార్లో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుంది? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.









