బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా రాబోతున్న ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1500 నుండి రూ. 2000 కోట్లు వసూలు చేస్తుందని ఆయన అంచనా వేశారు. ఒకవేళ ఇదే జరిగితే, ప్రస్తుతం ఇండియన్ సినిమాపై కొనసాగుతున్న దక్షిణాది చిత్రాల ఆధిపత్యానికి గండి పడుతుందని వర్మ విశ్లేషించారు.
దక్షిణాది సినిమాలు ఇంకా పాత పద్ధతుల్లోనే రూపొందుతున్నాయని, గాల్లో ఎగరడం వంటి అతిశయోక్తులు కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలనే ప్రేక్షకులు ఇష్టపడతారని వర్మ పేర్కొన్నారు. ‘ధురంధర్ 2’ విజయం సాధిస్తే సౌత్ సినిమాలు పక్కకు వెళ్లక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా ఒకేసారి చిత్రీకరించడం వల్ల, మొదటి భాగంతో కనెక్ట్ అయిన ప్రేక్షకులు రెండో భాగం కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
మొదటి భాగం కంటే రెండో భాగమే భారీ వసూళ్లు సాధిస్తుందని, ఇది బాలీవుడ్కు పూర్వ వైభవం తెస్తుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాదిలో కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సౌత్ vs నార్త్ సినిమా చర్చకు దారితీశాయి.









