మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ అనగానే అభిమానులకు ‘వాల్తేరు వీరయ్య’ సృష్టించిన సునామీ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ చేతులు కలుపుతుండటంతో టాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవి కెరీర్లో మెగా 158గా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్లో ఘనంగా ప్రారంభం కానుంది. గత ఏడాది విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, చిరంజీవిలోని వింటేజ్ మాస్ను వెండితెరపై ఆవిష్కరించింది. బాబి దర్శకత్వంలో మెగాస్టార్ను చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. తాజాగా మెగా 158 ప్రకటనతో ఆ నిరీక్షణకు తెరపడింది.
ఏప్రిల్లో ముహూర్తం
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం పనులు తుది దశకు చేరుకోవడంతో, తదుపరి చిత్రంపై మెగాస్టార్ దృష్టి సారించారు. బాబి ఇప్పటికే పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని, ఏప్రిల్ నెలలో ఉగాది పర్వదినం సందర్భంగా లేదా దానికి దరిదాపుల్లో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మెగా 158 గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, ఇందులో చిరంజీవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లేదా ఒక మాస్ లీడర్ పాత్రలో కనిపిస్తారని టాక్. బాబి సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి, ముందుగా ఏఆర్ రెహమాన్ ను అనుకున్నారు, కానీ అనివర్య కారణాల వల్ల థమన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇతర భాషల నటులు కూడా భాగం కానున్నట్లు సమాచారం, తద్వారా దీనికి పాన్-ఇండియా అప్పీల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే, తన బలం అయిన మాస్ ఆడియన్స్ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. బాబి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం ఖచ్చితంగా మాస్ జాతరను తలపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. వేసవిలో ప్రారంభం కానున్న ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే మన శంకరవర ప్రసాద్ తో మంచి జోష్ మీద ఉన్న మెగాస్టార్ ఈ సినిమా తో ఏం చేస్తారో చూడాలి మరి.







