టీ20 ప్రపంచకప్లో అత్యంత కీలకమైన సూపర్ 8 పోరు శనివారం కొలంబోలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ చేరే నాలుగు జట్లు ఏవనే దానిపై భారత మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. గ్రూప్ ‘ఏ’ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, దక్షిణాఫ్రికాలు ముందంజలో ఉంటాయని మెజారిటీ మాజీలు భావిస్తున్నారు. గ్రూప్ ‘బీ’ నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ లేదా శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని వారు విశ్లేషించారు. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన వీడియోలో ఛెతేశ్వర్ పుజారా, మహ్మద్ కైఫ్ వంటి వారు తమ ఫేవరెట్ జట్ల పేర్లను వెల్లడించారు.
మాజీ క్రికెటర్ల అంచనాలను గమనిస్తే.. ఛెతేశ్వర్ పుజారా భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్లను ఎంచుకోగా, మహ్మద్ కైఫ్ మరియు చాహల్ భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్లకు ఓటేశారు. అయితే మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ మాత్రం సంచలన జోస్యం చెప్పారు. ఆయన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లను కాదని.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్థాన్లు సెమీస్ చేరుతాయని అంచనా వేశారు. సంజయ్ బంగర్, సబా కరీం వంటి వారు కూడా భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఖచ్చితంగా టాప్-4లో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సూపర్ 8లో భారత్ తన తొలి పోరును ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత జింబాబ్వే (చెన్నైలో), వెస్టిండీస్ (కోల్కతాలో) జట్లతో తలపడనుంది. ఈ దశలో ప్రతి విజయం సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుండటంతో టోర్నీ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఒకే గ్రూప్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.









