హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను ఏ11 (A11) నిందితుడిగా చేర్చారు. ప్రధానంగా థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా పేర్కొన్న పోలీసులు, మొత్తం 23 మందిని నిందితుల జాబితాలో పొందుపరిచారు. థియేటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరియు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తమ నివేదికలో నిర్ధారించారు.
గతేడాది డిసెంబర్ 3న జరిగిన ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఛార్జ్షీట్లో ముగ్గురు మేనేజర్లు, ఎనిమిది మంది బౌన్సర్ల పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. అలాగే నలుగురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు కీలక ఆధారాలుగా పరిగణించారు. ప్రమాదం జరిగి ఏడాది కావొస్తున్నా, గాయపడిన చిన్నారి శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదని, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు బాధితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్ గతంలో రూ. 75 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే బాధితుడి భవిష్యత్తు అవసరాల కోసం వారి బ్యాంకు ఖాతాలో రూ. 2 కోట్లు డిపాజిట్ చేసినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఛార్జ్షీట్ దాఖలైన నేపథ్యంలో ఈ కేసు తదుపరి విచారణ ఏ విధంగా సాగుతుందనేది ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.









