ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 68 లక్షల కుటుంబాలకు తాగు నీరు సరఫరానిడదవోలు నియోజక వర్గం పెరవలిలో పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దీక్షబూని ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు గారి పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలచుకొనేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకానికి ‘అమరజీవి జలధార’ అని నామకరణం చేసినట్లు పవన్ స్ఫష్టం చేశారు.
ప్రతి మనిషి జీవితంలో ఉరుకుల పరుగులన్నీ అన్నపానీయాల గురించే ఉంటాయి. నేను… నా కుటుంబం… వారికి మూడు పూటలా పట్టెడన్నం, స్వచ్ఛమైన నీరు అందించాలనే తపన ప్రతి మనిషికి ఉంటుంది. ఉండాలి. కానీ… నేను, నా కుటుంబం అనే దగ్గరే ఆగిపోకుండా… సమాజం, నా ప్రజలు, నా రాష్ట్రం, నా భాష అని గళమెత్తి, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పేరును ప్రతి ఒక్కరూ తలచుకొనేలా చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అన్నపానీయాలు మాని, 56 రోజుల పాటు మండుతున్న కడుపు, ఎండిపోయిన డొక్కకు బంకమట్టి రాసుకుని పోరాడిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహా మనిషి త్యాగానికి నివాళిగా అమరజీవి జలధార అని ఖరారు చేసినట్లు ప్రకటిచారు.అమరజీవి జలధార’ పోస్టర్ ను పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
వచ్చే 30 ఏళ్లకు రూ.1.21 లక్షల కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం రూ.7,910 కోట్లతో నిర్మించనున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటికే మార్కాపురంలో శంకుస్థాపన పూర్తయ్యింది.
పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో రెండు ప్రాజెక్టులు పరిధిలో 23 నియోజకవర్గాలకు తాగునీటిని అందివ్వనున్నారు. వీటికి రూ.3,050 లు కేటాయించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు రూ. 1400 కోట్లు,ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కు రూ.1,650 కోట్లు నిధులను వెచ్చిస్తున్నారు. వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చడం లక్ష్యంగా ఇవి నిర్మాణం కానున్నాయి.









