పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బృందం, సినిమా ప్రచారంలో భాగంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినిమా చరిత్రలో తొలిసారిగా, లక్ష మంది అభిమానుల చేతుల మీదుగా తొలి పాట లిరిక్ షీట్ను ఆవిష్కరించేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు అభిమానులు పాల్గొనేందుకు వీలుగా చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా రూపొందించింది.
‘దేఖ్ లేంగే సాలా‘ అనే ఈ పాట లిరిక్ షీట్ను ఆవిష్కరించడంలో పాల్గొనాలనుకునే అభిమానులు, చిత్ర బృందం సూచించిన వెబ్సైట్లో కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. లక్ష మంది అభిమానులు తమ ఎంట్రీలను నమోదు చేసిన వెంటనే, అదే వెబ్సైట్లో పాట లిరిక్ షీట్ ప్రత్యక్షమవుతుంది. ఈ వినూత్నమైన ప్రచార పద్ధతి సినిమాపై అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని, అంచనాలను పెంచింది. ఈ పాటను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత పవన్-హరీశ్-దేవిశ్రీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.









