సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తనకున్న పరిచయాలు మరియు పలుకుబడిని ఉపయోగించి కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి, సినీ పరిశ్రమలో జరుగుతున్న ఈ విధమైన సంఘటనలపై తీవ్ర స్థాయిలో స్పందించారు.
జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనదిగా చిత్రీకరించబడుతోందని, కొందరు దీనిని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని చిన్మయి ఆరోపించారు. “ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్దే తప్పవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం దారుణం” అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై తాను మాట్లాడిన ప్రతిసారీ జానీ మాస్టర్ భార్య తనకు ఫోన్ చేసి, తాము నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడవద్దని కోరుతున్నట్లు చిన్మయి వెల్లడించారు.
ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించిన చిన్మయి, ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే, అతన్ని విమర్శించిన వారే అతని నిర్దోషిత్వం గురించి గొప్పగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. “మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్గా భావించే మహానుభావులకు ఈ అంశం మరింత ఉపకరిస్తుంది,” అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “మైనర్లను వేధించి ఎలా తప్పించుకోవాలో వారికి కచ్చితంగా తెలుస్తుంది” అని విమర్శించారు. ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయికి న్యాయం జరిగి, నిందితుడికి శిక్ష పడాలని తాను ప్రార్థిస్తున్నానని చిన్మయి తన పోస్ట్ను ముగించారు.









