మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దృశ్యం 3’ తాజాగా అనుకోని వివాదంలో చిక్కుకుంది. సినిమాలో కనిపించిన ఓ వాహనం నంబర్ ప్లేట్ తనదేనని ఆరోపిస్తూ కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన రాజీవ్ పోలీసులను ఆశ్రయించాడు.
కుంచితన్నీ ప్రాంతానికి చెందిన రాజీవ్, మున్నార్ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తూ.. సినిమాలో మోహన్లాల్ పాత్ర ఉపయోగించిన వాహనంపై తన వ్యక్తిగత వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ను ఎలాంటి అనుమతి లేకుండా వినియోగించారని పేర్కొన్నాడు. దీనికి ఆధారంగా తన వాహనం ఆర్సీ పత్రాల ప్రతిని కూడా పోలీసులకు సమర్పించాడు.
సినిమాలో ఆ నంబర్ కనిపించే అన్ని సన్నివేశాల నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ఆ నంబర్ కారణంగా భవిష్యత్తులో తనకు అనవసర సమస్యలు, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇటీవల ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో, చాలామంది తన వాహనాన్ని ‘దృశ్యం’ సినిమాలో కనిపించిన వాహనంగా గుర్తిస్తున్నారని రాజీవ్ వెల్లడించాడు. ముఖ్యంగా యువత నుంచి ఎక్కువ స్పందన వస్తోందని తెలిపాడు. ఆసక్తికరంగా, రాజీవ్ వద్ద ఉన్న వాహనం మహీంద్రా స్కార్పియో కాగా, సినిమాలో చూపించిన వాహనం మాత్రం మరో కంపెనీకి చెందినదని పేర్కొన్నాడు. అయితే, రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం తనదేనని ఆయన స్పష్టం చేశాడు.
అంతేకాకుండా, సినిమా బృందం తనను ముందుగా సంప్రదించలేదని, నంబర్ వినియోగానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని రాజీవ్ ఆరోపించాడు. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోకపోతే నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్, దర్శకుడు జీతూ జోసెఫ్తో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.
ఈ వివాదంపై ‘దృశ్యం 3’ చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.








