ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, దర్శకుడు మారుతి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని, తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, ఎన్టీఆర్ పట్ల, ఆయన అభిమానుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని వివరించారు.
హైదరాబాద్లోని విమల్ థియేటర్లో జరిగిన ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ లాంఛ్ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ, “ఈ సినిమా తర్వాత కాలర్ ఎగరేసుకుంటారు లాంటి మాటలు నేను చెప్పను. ప్రభాస్ లాంటి కటౌట్కు అవి చాలా చిన్న మాటలు” అని అన్నారు. ‘కాలర్ ఎగరేయడం’ అనే పదం తమ హీరోకు చెందిందని భావించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో, సోషల్ మీడియాలో మారుతిపై ట్రోలింగ్ మొదలైంది.
ఈ వ్యవహారం ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీయడంతో మారుతి వెంటనే స్పందించారు. “ఎన్టీఆర్ గారి ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. కొన్నిసార్లు ఉత్సాహంలో మాట్లాడినప్పుడు మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని ఆయన తన పోస్ట్లో వివరించి, ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.









