నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘అఖండ 2’. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఈ వేడుకను చాలా ఘనంగా నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కూడా మరో అతిథిగా ఆహ్వానించినప్పటికీ, ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో హాజరుకాలేకపోతున్నారని సమాచారం. అయితే, సినిమా విడుదలైన తర్వాత జరిగే సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ పాల్గొనే అవకాశం ఉందని చిత్ర బృందం తెలిపింది.
భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మరియు ‘జాజికాయ జాజికాయ’ పాట ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. మరోవైపు, డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు, డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.









