తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సినీ దిగ్గజాలు విజయ్, రజనీకాంత్ అభిమానుల మధ్య వివాదం ముదిరింది. ఇటీవల తమిళ వెట్రి కళగం (TVK) నేత ఆదవ్ అర్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చారని, రజనీకాంత్ మాత్రం భయపడి వెనకడుగు వేశారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను రజనీ అభిమానులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఖండించడంతో, సోషల్ మీడియా వేదికగా ఇరువర్గాల మధ్య ఫ్యాన్ వార్ ప్రారంభమైంది.
ఈ వివాదంపై స్పందిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అధికారిక లెటర్ హెడ్పై ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. తనపై జరిగిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ మరియు ఇతర రాజకీయ ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా “కాలం మాట్లాడదు.. కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది” అంటూ ఆయన రాసిన వ్యాక్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాను మౌనంగా ఉన్నానంటే అది చేతకానితనం కాదని, సరైన సమయంలో కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
రజనీకాంత్ విడుదల చేసిన ఈ లేఖ ద్వారా తన మద్దతుదారుల్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా, విమర్శలు చేసేవారికి సున్నితంగానే గట్టి కౌంటర్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా తనకు లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావించడం ద్వారా తన స్థాయిని మరోసారి గుర్తుచేశారు. ఈ పరిణామంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ డిఫెన్స్లో పడగా, రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.









