ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచేది పాకిస్థాన్ కాదని, భారత్ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆదివారం జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఐసీసీ టోర్నమెంట్లలో భారత్కు అద్భుతమైన రికార్డు ఉందని, దానిని ఇప్పటి టీమ్ కూడా కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిమిత ఓవర్లలో భారత్ చాలా బలమైన జట్టు అని ఆయన అన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని గంగూలీ తెలిపారు.