మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్కు ప్రేమ్ సాగర్ రావు ప్రధాన స్థంభమని ప్రశంసించారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు.
కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ఇది గోప్యమైన అంశమని, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై అవాస్తవ ప్రచారం చేయడం సరైనది కాదని మండిపడ్డారు. నాలుగు కీలక పథకాల గురించి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవి ఆగే ప్రసక్తే లేదని, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో నడిచే నాయకుడిగా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రచారానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఇంత మంచి పాలన చూడలేదని, రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించి స్థానిక పరిపాలనను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తన రాజకీయ జీవితం విశ్వసనీయతతో నిండిపోయిందని, వరుసగా ఏడు సార్లు ప్రజల ఆదరణ పొందిన వ్యక్తినని గుర్తుచేశారు.
కేటీఆర్ అరెస్టుపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. తన సొంత నియోజకవర్గమైన హుజుర్ నగర్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకపోవడంపై ఇంజినీర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులకు ఫోన్లోనే ఆదేశాలు ఇచ్చారు. సమస్యలను గుర్తించి, పనులను మౌలికంగా ముందుకు తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను హైదరాబాదుకు రావాలని ఆదేశించడంతో పాటు, రాష్ట్రంలోని అభివృద్ధి పనులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. “నా సొంత నియోజకవర్గంలోనే పనులు ఇలా సాగితే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు.









