కోట్ల మంది భక్తులతో కిక్కిరిసి ఉన్న మహా కుంభమేళలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ -5 లోని టెంట్ల నుంచి ఒక్కసారిగా భారీ అగ్నికీలలు ఎగిసిపడడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద నదీ స్నానాలు చేసేందుకు కోట్ల మంది భక్తులు తరలివస్తున్నారు. వీరందరికీ వసతులు కల్పించేందుకు ప్రభుత్వం.. నదీ ఒడ్డున భారీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అక్కడే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు.. మంటలను అందుపులోకి తీసుకువచ్చాయి. టెంట్ లోని భక్తులు వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే.. ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడి భక్తులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏమైందో తెలియక.. పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి దూరంగా పరుగెత్తేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రమాదంపై డీఐజీ వైభవ్ కృష్ణ వివరాలు వెల్లడించారు. గీతా ప్రెస్లోని టెంట్లలో మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపిన డీఐజీ.. కొన్ని టెంట్లు ఇతర వసతులు కాలిపోయినట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ఉన్న 30కి పైగా టెంట్లు అగ్ని కీలల్లో చిక్కున్నాయి. అవ్వన్నీ పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం. ప్రమాదల నియంత్రణకు, భద్రతకు యూపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన నేపథ్యంలో.. క్షణాల వ్యవధిలోనే అగ్ని ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పేలుడుకు కారణంగా..గ్యాస్ సిలిండర్ గా దాదాపు నిర్థరించి, అగ్ని కీలల్ని అదుపులోకి తీసుకువచ్చారు.









