తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు.
పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముంది.
అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు జరగాలి. కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం ముందుగా భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి. అందుకు రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసుకోవాలి. భూసేకరణలో మానవీయత ఉండాలి. భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో పేరుకుపోయిన పూడిక తీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నవిధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఏ ఏ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయి. వాటికి అవసరమైన నిధుల వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే సమావేశం నుంచి అన్ని జిల్లాల ఎస్ఈలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఏమన్నారంటే?
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలని యువ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జలసౌధ వేదికగా జరిగిన కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో నూతనంగా నియమితులైన ఇంజనీర్లకు పత్రాలు అందజేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అధికారులు ఎలాంటి తప్పు చేయకూడదో ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు.
“ఇది మీకు ఉద్యోగం కాదు. ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. నీళ్లు నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం. అలాంటి శాఖకు ప్రతినిధులుగా నియమితులవుతున్నారు. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
టీఎస్పీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నీటి పారుదల శాఖ కార్యాలయం జల సౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా AEEలను ఉద్దేశించి సీఎంగారు పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణాలేంటో గమనించాలి. హైదరాబాద్ జంట నగరాలకు మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆదర్శంగా తీసుకోండి. గడిచిన పదేళ్లలో రెండు లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కారాదు అని వ్యాఖ్యానించారు.
ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్నవారే రాణిస్తారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంజనీర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం. దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. కార్యక్రమ ముగింపులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జలసౌధకు వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు.