Search
Close this search box.

  పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..!

జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూ అపవిత్రం అయిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్షను మొదలు పెట్టనున్నారు.

 

అధినేత తీరు అలా ఉండగా.. అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు మాత్రం బూతులతో రెచ్చిపోతున్నారు. సామాన్య జనాలకు తమ తడాఖా చూపిస్తోన్నారు. తమ స్థాయిని మర్చిపోతున్నారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే అనేక చోట్ల దాడులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి.

 

జనసేన శాసన సభ్యుల వైఖరి కూడా దీనికి ఏ మాత్రం తీసిపోవట్లేదని నిరూపించే తాజా ఘటన ఇది. కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్, ఫొరెన్సిక్‌ విభాగం హెడ్ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. బూతులతో రెచ్చిపోయారు.

 

రంగారాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌ను పంతం నానాజీ అనుచరులు అనధికారికంగా వాడుకుంటోండటమే దీనికి కారణం. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గ్రౌండ్‌లో సుమారు రెండున్నర నెలల నుంచీ వాలీబాల్‌, ఇతర గేమ్‌లను ఆడుతున్నారు పంతం నానాజీ అనుచరులు. తమ గ్రౌండ్‌ను వాడుకోవద్దంటూ సిబ్బంది పలుమార్లు వారిని కోరినప్పటికీ వినిపించుకోలేదు.

 

దీనితో వాళ్లు మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వింగ్‌కు వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం పంతం నానాజీ అనుచరులు మళ్లీ గ్రౌండ్‌కు వచ్చి, వాలీబాల్‌ నెట్‌ కడుతోన్న సమయంలో డాక్టర్‌ ఉమామహేశ్వరరావు వారిని అడ్డుకున్నారు.

 

ఈ విషయాన్ని వాళ్లు ఎమ్మెల్యే పంతం నానాజీకి వివరించగా.. ఆయన హుటాహుటిన మెడికల్ కాలేజీకి వచంచారు. ఉమా మహేశ్వరరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. బూతులతో రెచ్చిపోయారు. ఆయన ధరించిన మాస్క్‌ను తొలగించారు. ఒక దశలో కొట్టడానికీ ప్రయత్నించారు.

 

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనపై ఉమా మహేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్న విషయం తెలుసుకుని పంతం నానాజీ ఆయనకు క్షమాపణ చెప్పారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు