యూనివర్సిటీల ర్యాంకింగ్ నకు ప్రణాళిక : మంత్రి లోకేష్
ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కరిక్యులమ్ లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో మంత్రి ముఖ్యంగా చర్చించారు.
ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చి, యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెంచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. విద్యా దీవెన నిధులపైనా ఆరా తీశారు. విద్యార్థులకు సకాలంలో అందాల్సిన సౌకర్యాలు, ప్రస్తుతం యూనివర్సిటీల్లో పరిస్థితులపై లోకేష్ సమీక్షించారు. అధికారులు పూర్తి స్థాయి వివరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని చెప్పాల్సి ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా వారికి స్పష్టం చేశారు.