చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారణాసిలో మహేష్ బాబుపై భారీ బుల్ ఫైట్ సీక్వెన్స్ను తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల్లో ఒకటిగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే గ్లింప్స్లో మహేష్ బాబు పాత్రకు సంబంధించిన పవర్ఫుల్ ఎలివేషన్స్తో పాటు బుల్కు సంబంధించిన విజువల్స్ కనిపించడంతో.. ఇప్పుడు వస్తున్న ఈ వార్త సినిమాపై మరింత హైప్ను పెంచుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్ శివార్లలో వచ్చే వారం ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరపడానికి చిత్రబృందం సిద్ధమవుతోందట. ఈ బుల్ ఫైట్ను సాధారణ యాక్షన్ సీన్లా కాకుండా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హై క్వాలిటీ విజువల్స్తో ఈ సీక్వెన్స్ను ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించే విధంగా రూపొందించనున్నారని టాక్.
ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. పలు దేశాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న కాలాల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.
మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కథలో భాగంగా వారణాసి నగరం ఒక భారీ ప్రమాదాన్ని ఎదుర్కొనే సమయంలో.. రుద్ర అనే పాత్ర చుట్టూ కథ ప్రధానంగా సాగనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సంస్కృతి, పురాణ అంశాలు, ప్రపంచ స్థాయి అడ్వెంచర్ ఎలిమెంట్స్ను కలిపి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే హైదరాబాద్తో పాటు కెన్యా, ఒడిశా వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు అంటార్కిటికాలోనూ ఈ సినిమా కోసం కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్పై అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
భారీ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీ కోసం అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









